శ్రీకాకుళం, అక్టోబర్ 19 ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి అప్పారావు సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి సెప్టెంబర్ 30వ తేదీన నోటిఫికేషన్ వెలువడిందని, అదే రోజు నుంచి ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. అయితే నవంబరు 6వ తేదీన ఓటర్ గా నమోదుకు చివరి తేదీగా నిర్ణయించామని స్పష్టం చేశారు. నవంబరు 23న ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుందని, 23 నుంచి డిసెంబరు తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరన్స్ హల్ లో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి కె తవిటి నాయుడు, సి సెక్షన్ సూపరేంటెండెంట్ రాజేశ్వర రావులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వచ్చే ఏడాది మార్చి 29వ తేదీకి ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గడువు ముగుస్తుందని, ఈ నేపథ్యంలో సంబంధిత ఓటర్ల జాబితా రూపకల్పనపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు. అర్హులైన ఉపాధ్యాయులు ఆయా జిల్లాల పరిధిలో నియమించిన అధికారుల వద్ద గానీ, ఆన్లైన్ విధానంలో గానీ ఫారం-19 సమర్పించవచ్చని చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు సెకండరీ స్థాయికి నుండి (ఆరో తరగతికి పైబడి) పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా అర్హులేనని స్పష్టం చేశారు. పార్ట్ టైమ్ విధానంలో పనిచేసే వారు అర్హులు కారని అన్నారు.
ఓటు నమోదులో భాగంగా స్వీయ ధ్రువీకరణ పత్రంతో పాటు సంబంధిత సంస్థ హెచ్ఒడి నుంచి సర్టిఫికేట్ తీసుకొని సమర్పించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వీటితోపాటు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కౌంటర్ సైన్ చేసిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కళాశాల స్థాయిల్లో పనిచేసే వారు సంబంధిత ఆర్జెడిల కౌంటర్ సైన్తో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందన్నారు. యూనివర్శిటీ స్థాయిలో పనిచేసేవారు విసి నియమించిన అర్హత గల అధికారుల నుంచి కౌంటర్ సైన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గత ఆరేళ్లలో సెకండరీ స్థాయికి మించిన ఏ విద్యాసంస్థలో అయినా మూడేళ్లకు తగ్గకుండా పనిచేసిన ఉపాధ్యాయులు అర్హులన్నారు. వారంతా నవంబరు 6వ తేదీ లోగా ఫారం-19 సమర్పించటం ద్వారా ఓటరుగా నమోదు కావాలని సూచించారు. గతంలో ఓటు ఉన్న వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని, పాత ఓటు చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో ఓటు వేయడానికి అవకాశం లేదని, ఓటు వేయడానికి ఆధార్ కార్డు చిరునామా పరిధిగా నిర్ణయించామని, 2024 సంవత్సరానికి ముందు గడిచిన ఆరు సంవత్సరాలలో కనీసం మూడు సంవత్సరాలు ఉపాధ్యాయ విధులు నిర్వహించిన వారు మాత్రమే ఓటు నమోదుకు అర్హులుగా డిఆర్ఓ పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఓటర్లు అధిక శాతంలో నమోదు అయ్యేలా సహకరించాలని ఉద్యగ సంఘాలకు ఆయన పిలుపునిచ్చారు.
0 Comments