ప్రజా పత్రిక: పేరుకు మున్సిపాలిటీ కానీ... ఇంకా అనేక వార్డుల్లో గ్రామీణ వాతావరణంలా కనిపించే ఇచ్ఛాపురంలో చెత్తపైన పన్ను ఎలా వసూలు చేస్తారని అధికార పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు యూజర్ ఛార్జీల పెంపుపై వాడివేడి చర్చ సాగింది. అధికార పార్టీ కౌన్సిలర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఇంటి, నీటి పన్నులు కట్టలేని స్థితిలో ఉన్న ప్రజానీకం ఉన్నారని, ఇప్పుడు చెత్త మీద పన్ను ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో సరిగా వ్యాపారులు సాగకపోవడంతో ఆదాయం కోల్పోయారని, ఈ సమయంలో యూజర్ ఛార్జీల భారం మోపడం సరికాదని వైస్చైర్మన్ భారతిదివ్య అన్నారు. ఛార్జీల భారం తగ్గించేందుకు ప్రయత్నించాలని కౌన్సిలర్ లాభాల స్వర్ణమణి సూచించారు. ప్రస్తుత పరిస్థతుల్లో ఇంటి పన్నులు సకాలంలో కట్టుకొలేని ప్రజలకు చెత్త మీద పన్ను భారంగా మారుతుందని టిడిపి కౌన్సెలర్ ఎ.లీలారాణి అన్నారు. చివరికి కొన్ని సవరణలు ప్రతిపాదించిన అంశాలతో మున్సిపల్ ఉన్నత అధికారులకు పంపించేందుకు తీర్మానం చేస్తూ ఆమోదముద్ర వేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ఆమోదించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, ఎఇలు కేదారనాథ్, శివ, శానిటరీ ఇన్స్పెక్టర్ పకీర్రాజు పాల్గొన్నారు.
0 Comments