శ్రీకాకుళం:మనసును ఆధీనం ఉంచడం, జీవితాన్నిఆనందమయం చేసుకోవడం, ఆత్మశుద్దితో ధ్యానంతోనే లభిస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద నుంచి 7 రోడ్ల కూడలి వరకు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ప్రతినిధి బిందు మాధవి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మెగా శాకాహార సద్భావన ర్యాలీని ఆదివారం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని మాట్లాడారు. ఆత్మశుద్దికి అనువైన మార్గం ధ్యానం అని చెప్పారు. ధీ, యానం పదాల కలయికే ధ్యానం! ధీ అంటే బుద్ధి అని యానం అంటే ప్రయాణం అని చెప్పారు. అందరూ బుద్ధితో జీవనం కొనసాగించడమే ధ్యానమని పేర్కొన్నారు. పత్రిజీ పిరమిడ్ ద్వారా సహజసిద్ధమైన యోగా చేసుకోవచ్చన్నారు. పిరమిడ్ ధ్యానం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని చెప్పారు. తాను ప్రతీరోజూ ధ్యానం, ప్రాణయామం, సుదర్శనక్రియ చేస్తానని అన్నారు. దీని వలన చెడు ఆలోచనలు మనసులోకి రావడని వివరించారు. శాకాహారం కోసం మానవ శరీరం రూపొందించారని చెప్పారు. శాకాహారం భుజించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరిన్ని ర్యాలీ నిర్వహించాలని సూచించారు. తాను గత తొమ్మిదేళ్లుగా మాంసాహారానికి దూరంగా ఉన్నానని, శాకాహారం తీసుకుంటే శరీరం తేలిక పడుతుందన్నారు. ధ్యానం అంటే కష్టంతో కూడుకున్న క్రతువు అనుకోవద్దని ఇది తేలికైన ప్రక్రియ అని చెప్పారు. ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ అధ్యక్షులు రాయ్ జగపతిరాజు మాట్లాడుతూ మాంసాహారం వద్దు.. శాకాహారమే ముద్దు అంటు నినాదం చేశారు. నఈ సందర్భంగా రాయి జగపతిరాజు, బిందు మాధవి మాట్లాడుతూ మాంసాహారం భుజించడం వల్ల లేని వ్యాధులను కొనితెచ్చుకోవడమేనని, శాకాహారం భుజించడం వల్ల ఆరో గ్యాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. అహింసా ధర్మాన్ని పాటిస్తు ధ్యానం చేస్తే సుఖ సంతోషాలతో పాటు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తామని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు అహింసా ధర్మాన్ని పాటిస్తు సుఖసంతోషాలతో జీవించాలని వారు కోరారు. మాంసాహారం అధికంగా తీసుకోవడం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. శాకాహారులు మాంసం తినేవారి కంటే తక్కువ బరువు కలిగి ఉంటారని తక్కువ క్యాన్సర్ రేట్లు కలిగి ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఎంసీ డైరక్టర్ సిద్ధా నాగేశ్వరరావు, ఇస్కాన్ ప్రభు శ్రీనివాస గోవిందతో పాటు బాలాజీరావు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments