శ్రీకాకుళం, ఆగస్టు 12 : జిల్లాలో పెండింగ్ కేసులను తగ్గించేందుకు రాబోయే నెల 13న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగే ఈ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాజీ పద్ధతి ద్వారానే ఇరు పక్షాలు గెలుస్తాయని, భవిష్యత్తులో సౌహార్ద సంబంధాలు కొనసాగుతాయని చెప్పారు. మోటారు వాహన ప్రమాదాల కేసుల్లో బీమా సంస్థలు త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, మూడవ అదనపు జిల్లా జడ్జి సి.హెచ్.వివేక్ ఆనంద్ శ్రీనివాస్, నాలుగవ అదనపు జిల్లా జడ్జి ఎస్.ఎల్.ఫణికుమార్, కార్యదర్శి కె.హరిబాబు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్, అదనపు ఎస్పి పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వి.వెంకటప్పరావు, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
0 Comments